Saturday, May 15, 2010

శంకర జయంతి , Sankara Jayanthi




భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే

సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞకరణే

అనే శ్లోకాలు మన చెవికి తాకినంతనే వెంటనే మనకు జ్ఞప్తికి వచ్చేది శ్రీశంకరభగవత్పాదులే! మానవులకు భక్తి, జ్ఞాన, కర్మలద్వారా మానవజీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తికి మార్గము చూపిన మార్గదర్శకులు శ్రీశంకర భగవత్పాదులే. వీరిబాట మానవులకు మంగళకరం మరియు అత్యంత జయప్రదం. అట్టి వీరి 'జన్మదినం' హిందూ జాతికంతటికి మరపురాని మహాపవిత్రమైన పుణ్యదినం.

పూర్వం కేరళ రాష్ట్రమందు "శివగురువు - ఆర్యాంబ" అనువారు కాలడి అనే ఒక చిన్ని గ్రామములో జీవిస్తూ ఉండేవారుట! వారు ఇరువురు భగవంతునిపై ఎంతో భక్తి భావము ఉంచి ఎన్ని నోములు నోచిన, ఎన్ని వ్రతాలు చేసిన ఆ పుణ్య దంపతులకు "సంతానభాగ్యము" మాత్రము కలుగలేదుట! ఆ దంపతులు 'తిరుచునాపల్లి ' చేరి అచ్చటగల వృషభాచలేశ్వరుని దర్శించి సేవించినారు. ఒకనాడు శివగురువునకు భగవానుడు కలలో కనిపించి "మీకు తక్కువ కాలము జీవించు జ్ఞానవంతుడు కావలెనా? లేక అయోగ్యుడైన ఎక్కువకాలము జీవించు కుమారుడు కావలెనా? వీటిలో ఏ వరం కావాలో కోరుకోమంటాడు అంత శివగురువు ఆలోచించి దీర్ఘాయువు కలిగిన అయోగ్యుడైన కుమారుని వల్ల ఏమి ప్రయోజనము? "పుత్రోత్సాహము తండ్రికి" అనునటుల, మాకు యోగ్యుడైన కుమారుని ప్రసాదించమని శివగురువు కోరుకుంటాడు. ఆ వర ప్రభావముతో కొలది కాలానికి ఆర్యాంబ గర్భం దాల్చి "వైశాఖశుద్ధ పంచమి"నాడు దివ్యతేజోకాంతులతో విరాజిల్లే పుత్రుని కన్నదట! ఆ పుత్రుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వానికి 'శంకరుడు అనిపేరు పెట్టుకున్నారు. "శంకరోతి ఇతి శంకరః" అంటే మానవులకు సర్వశుభాలకు, సర్వ సంపదలకు, సర్వవిద్యలకు మూలాధారమైనవాడు అని అర్థము. ఆలాగునే ఆ బాలుడు శుక్లపక్షచంద్రునిలో కళలు రోజురోజుకు అభివృద్ధిచెందునట్లు, పువ్వుపుట్టగానే పరిమళాలను వెదజల్లుతున్నట్లు ఆ పిల్లవాడు 'మూడవసంవత్సరం' బాల్యమందే సమస్తవిద్యలు చదువుట వ్రాయుట నేర్చుకున్నాడట.

ఇలా ఉండగా వృద్ధుడవుతున్న 'శివగురువు' తన కుమారునకు ఏడవ ఏట ఉపనయన సంస్కారములు చేయాలను కోరికతోనే ఆకస్మికమరణం పొందినాడు. అంత ఆ వైధవ్యము పొందిన 'ఆర్యాంబ' తమతోటి బంధువుల సహాయమును అర్థించి కుమారునకు ఉపయనయ సంస్కారము చేయిస్తుంది. అనంతరం శంకరులకు ఎనిమిదవ సంవత్సరము వచ్చుసరికి సర్వశాస్త్ర పండితుడు, సర్వశక్తి వంతుడు అవుతాడు. అందులకు తార్కాణంగా!

తన మాతృమూర్తి వృద్ధాప్యముతో బాధపడుచు ఎండనక, వానఅనక, సుదూర ప్రాంతమందుగల నదికి స్నానానికి నిత్యము వెళుతూ ఉండేది. ఆ తల్లి పడుతున్న బాధకు కలతచెంది ఎలా అయినాసరే? ఆ తల్లి బాధను తొలగించాలని తలచి "గంగాస్తవం" చేయగా ఆ నదీమతల్లి ప్రసన్నురాలై తన ప్రవాహమార్గాన్ని మరలించుకుని ఆచార్యులవారి గృహమునకు అత్యంత సమీపంగా ప్రవహించ సాగిందట! అది వారికి గల మాతృభక్తికి, వారికి గల దివ్యశక్తికి కేవలం మచ్చుతునక మాత్రమే!

ఆ తల్లి 'ఆర్యంబ' కుమారుని మాతృభక్తికి ఎంతో సంతసిస్తూ సుమారునికి యుక్తవయస్సు వస్తోందని గమనించి కుమారునకు వివాహ ప్రయత్నాలు చేయసాగింది. కాని శంకరులకు సన్యాస దీక్ష వహించాలని కోరిక! అట్టి వివేక వైరాగ్యములతో మనసంతా నింపుకునియున్నారు. కాని తల్లికి ఏ మాత్రము మనస్సుకు కష్టము కలుగుకుండా జ్ఞానబోధతో ఒప్పించి సన్యాసదీక్ష తీసుకుంటారు. ఎంతైనా మాతృమూర్తికి గల పుత్రవాత్సల్యం వెలకట్టగలమా చెప్పండి ఆ తల్లి మనోవేదన గ్రహించిన శంకరుడు మాతా! నీవు ఏ మాత్రము చింతించవలదు. నీ అవసానదశలో కేవలం నన్ను స్మరించినంతనే నీముందుండి నీకు తృప్తిగా సర్వకర్మలను నెరవేర్చగలనని చెప్పెను. ఆ ఇచ్చిన మాటప్రకారం ఆమె అవసాన కాలమందు కుమారా శంకరా! అని తలవగానే ప్రత్యక్షమయి, జరామరణ భారంతోనున్న తల్లికి సర్వలోక సుఖప్రదమైన "శుద్ధనిర్గుణ " తత్వాన్ని బోధించుటకు ప్రయత్నిస్తారు. కాని తల్లి వారి మాటలు అర్థంచేసుకునే స్థితిలో లేదు. దానితో మాతృభక్తి పరాయణుడైన శంకరుడు ఇలా పరమేశ్వరుని ప్రార్ధిస్తారు.

"అనాద్యంత మాద్యం పరంతత్వమర్ధం చిదాకార మేకం తురీయం త్వమేయం

హరిబ్రహ్మ మృగ్యం పరబ్రహ్మరూపం మనోవాగతీతం మహాశైవమీడే"

అని శంకరులు స్తుతించగా! ఆ మహాదేవాది దేవుడు 'పరమేశ్వరుడు' ప్రత్యక్ష భాగ్యముతో తల్లికి సద్గతి కలిగించి మాతృభక్తిని నిరూపించుకున్నారు.

ఒకసారి శంకరులు గురుకుల విద్యాభ్యాస సమయమందు ఒక బ్రాహ్మణుని ఇంట భిక్షను అర్థిస్తారు. ఆ ఇంటి ఇల్లాలు కడుదారిద్ర్య బాధను అనుభవిస్తూ, నాయనా! మావద్ద ఈ ఎండిన ఉసిరికాయ తప్ప మరి ఏదియును లేదు అని వాని భిక్షపాత్రలో వైచి కన్నీరు మున్నీరుగా దుఃఖించసాగింది. ఆ దంపతుల దీనావస్థకు కలతచెందిన శంకరులు "శ్రీమహాలక్ష్మిని" సోత్రము చేసి ప్రసన్నము చేసికొని వారి దారిద్ర్య బాధను తొలగిస్తారు. ఆ స్తోత్రమే "శ్రీకనకధారాస్తోత్రమ్" అట్టి స్తోత్రమును 'మానవాళికి' అందించి వారి ఈతి బాధలను తొలగించుటకు మార్గము చూపిన 'కరుణామూర్తి' శ్రీశంకరాచార్యులవారు. వారు ప్రార్థించిన శ్రీ మహాలక్ష్మి కేవలం ఐశ్వర్యానికే ప్రధానం కాదుట! మానవులు కోరుకునే జ్ఞానము, సౌందర్యము, శక్తి మున్నగు సర్వ అభీష్టాలను ప్రసాదించే దేవతామూర్తియట!

"శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై

రత్యైనమో స్తు రమణీయ గుణార్ధవాయై

శక్యై నమో స్తు శతపత్ర నికేతనాయై

పుష్ట్యై నమో స్తు పురుషోత్తమ వల్లభాయై"

అంటే 'శృతి ' అంటే వేదం. అదేజ్ఞాన సంపదకు మూలాధారమైనది. 'రతి' సౌందర్యం అనే అర్థాన్ని ఇస్తుంది. 'శక్తి ' కదలిక లేక మనోవాంఛా బలం కలుగచేస్తుంది. 'పుష్టి ' అంటే! మానవులు ఆశించే మనోరధములు అన్నియు ఈయగల వరప్రదాయని అని ఆ శ్లోకార్థాన్ని వివరించి చెప్పుకోవచ్చు.

ఒకసారి శంకరాచార్యులువారు నర్మదా నదీతీరాన తపోదీక్షలోనున్న గోవింద భగవత్పాదులను కలిసినప్పుడు వారు అడిగిన ప్రశ్నలకు 'దశశ్లోకి' ద్వారా జవాబు చెప్పగా, వారువారిని తనప్రియ శిష్యునిగా అంగీకరించి వారు రచించిన 'బ్రహ్మసూత్రములకు ' వ్యాఖ్య వ్రాయమని కోరినారుట! ఆ విధంగా కాశీపురమందు బ్రహ్మ సూత్రములకు భాష్యము వ్రాసియున్నారు. ఆ సమయమందు చెప్పినదే 'మనీషాపంచకము'.

ఇలా ఉండగా ఒకరోజు వ్యాసభగవానులు శంకరాచార్యులవారిని పరీక్షించదలచి వృద్ధబ్రాహ్మణ వేషముతో బ్రహ్మసూత్రముపై ఒక సందేహము వెలిబుచ్చినారుట! దానికి శంకరాచార్యులవారు వారి సందేహము సంతృప్తికరంగా తీర్చుటచే వారు ఎంతగానో సంతసించి మరో 16 సంవత్సరము ఆయుర్ధాయమును ప్రసాదించి అద్వైత మత ప్రచారము చేయవలెనని కోరినారుట! దానితో శ్రీ శంకరభగవత్పాదులు దేశము నలుమూలలా శంకరమఠములు ఏర్పరచి సనాతన సంప్రదాయ ప్రచారము విస్తృతముగావించుచూ! తుంగభద్రానదీ తీరమున 'శారదానిలయము' నందు తాను స్వయముగా చెక్కిన "శ్రీచక్రరాజముపై" శారదా పీఠము ప్రతిష్ఠించి, వారు కైలాసమునుండి తెచ్చుకున్న ఐదుస్పటిక లింగాలను ప్రతిష్ఠించినారు.

అలాగునే శంకరులవారు తన అద్వైత మత సిద్ధాంత ప్రచారముతో శృంగేరి, ద్వారక, గోవర్థన, జ్యోతిర్మఠము అను నాలుగు పీఠాలను నిర్మించి, దేశము నలుమూలలా ఎన్నో దేవాలయములందు దేవి, దేవతలను ఎన్నో స్తోత్రములతో గానము చేస్తూ! వారిని పూజించి సేవిస్తూ మానవులందరిని భక్తి, జ్ఞాన, కర్మల ద్వారా అద్వైత మార్గాభిముఖులుగా త్రిప్పి, మోక్షమార్గాన్ని చూపిన జగద్గురువులు శ్రీ శంకరభగవత్పాదులు.
అటువంటి పుణ్యమూర్తి జన్మదినమున మన మంతా విశేషంగా జరుపుకుని పునీతులౌదాము



  • =====================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: